Bharat Jodo Yatra: విజయవంతంగా సాగుతున్న భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ లో జరుగుతున్న రాహుల్ గాంధీతో పాదయాత్రలో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ కూడా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి అడుగులో అడుగుతు వేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ హఠత్పరిణామానికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయ్యో.. ఏమైంది? అంటూ కుప్పకూలిన ఎంపీకి సపర్యలు చేశారు. అయినా, ఆయనలో స్పందన లేకపోవడంతో హుటుహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో సంతోఖ్ సింగ్ మరణించారని వైద్యులు తెలిపారు.
ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. వెంటనే హాస్పిటల్ కు వెళ్లారు. సంతోఖ్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు. ‘‘సంతోఖ్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఎంతో కష్టపడి పనిచేసే నాయకుడు. కాంగ్రెస్ కుటుంబానికి బలమైన వ్యక్తి. యూత్ కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జోడో యాత్రలో సంతోఖ్తో కలిసి నడిచిన ఫొటోలను షేర్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఎంపీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
1946 జూన్ 18న జలంధర్లోని ధలివాల్లో సంతోఖ్ సింగ్ జన్మించారు. కాంగ్రెస్ హయాంలో పంజాబ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో జలంధర్ నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు.