నిజామాబాద్, స్వేచ్ఛ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీ అరవింద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. మహేష్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కౌన్సిలర్గా కూడా గెలవలేని వారు తన గురించి మాట్లాడతారా అంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఆలయాలకు రక్షణ కరువైందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం.. కారణం అదేనా.. మరేదైనా ఉందా ?
దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు అరవింద్. 7చోట్ల బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందని, తన వల్లే జిల్లాలో కాంగ్రెస్ వీక్ అయ్యిందని అన్నారు. 93 కోట్ల రూపాయలతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబీ, రోడ్ల విస్తరణ ఇలా నియోజకవర్గానికి చాలా చేశానని వివరించారు ఎంపీ. రాష్ట్ర ప్రభుత్వం నిధుల బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని, రైల్వే రంగాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు అరవింద్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే, ఎవరిని ఎక్కడ ఉంచాలో తమకు తెలుసని హెచ్చరించారు.