Bandi Sanjay : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాాకాంక్షలు తెలియజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయ అంశమని పేర్కొన్నారు.
17 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించిందని బండి సంజయ్ గుర్తుచేశారు. లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీరు అవసరాల కోసం దాదాపు పన్నెండు గ్రామాల ప్రజల నుంచి భూమిని సేకరించారని తెలిపారు.
అధికారిక లెక్కల ప్రకారం బాధితుల సంఖ్య 12,500 మంది అని, వారందరికీ అప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేసిందనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ముంపు బాధితులకి ఐఏవై ఇళ్ళకు బదులుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని 2018 జూన్ 15 తేదిన బాధితులకి కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ బాధితులకి న్యాయం జరగలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాడతామని రెండు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి బాధితులకు న్యాయం చేయ్యాలని కోరారు.
నష్టపరిహారానికి అర్హత లేకపోయినా.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, అతని కుటుంబ సభ్యులకు..కేసీఆర్ బంధువులకు లబ్ది చేకూరిందని.. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక మంది ప్రాణ త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా శేయస్సు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని లేఖలో పేర్కోన్నారు.