Hospital: సడెన్ హార్ట్ఎటాక్ మరణాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు గుండెపోటుకు గురై ఆకస్మాత్తుగా చనిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రోజుల బిడ్డకు పాలిచ్చిన ఓ బాలింత.. కార్డియాక్ అరెస్ట్తో ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందుకు చెందిన సుస్మిత డెలివరీ కోసం ఈ నెల 13న వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చేరారు. ఈనెల 16న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తటంతో హాస్పిటల్లోని నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చారు. దీంతో అక్కడే బిడ్డకు పాలు పడుతూ సీమాంక్ వార్డులో సుస్మిత ఉంటోంది. ఎప్పటిలాగే తెల్లవారుజామున 4 గంటల సమయంలో బిడ్డకు పాలు పట్టింది.
ఆ తర్వాత పక్కవార్డులో పడుకున్న ఆమె.. ఉదయం 6 గంటలైనా నిద్రలేవలేదు. కుటుంబ సభ్యులు తట్టిలేపగా.. ఎలాంటి చలనం లేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లకు విషయం చెప్పారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. వెంటనే సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అంతలోనే ప్రాణాలు విడిచిన సుస్మిత గాథ తీవ్ర విషాదం నింపుతోంది. పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ.. తల్లికి దూరమవడం కన్నీరుపెట్టిస్తోంది.