KCR Modi: జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. జనవరి 19న హైదరాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ. అక్కడే బహిరంగ సభలో మాట్లాడే ఛాన్స్.
ఆ రెండు రోజులు రాజకీయం రంజుగా మారుతుందని అనుకున్నారంతా. ఖమ్మం సభలో ప్రధాని మోదీకి కేసీఆర్ పలు సవాళ్లు చేయడం ఖాయం.. ఆ మర్నాడే సికింద్రాబాద్ సభలో కేసీఆర్ కు మోదీ కౌంటర్లు ఇవ్వడం పక్కా.. అంటూ ప్రచారం జరిగింది.
ఇటీవల ప్రధాని మోదీ రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో అలానే జరిగింది కాబట్టి.. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారు. కానీ, అంతా తూచ్.
జనవరి 19న ప్రధాని మోదీ హైదరాబాద్ విజిట్ రద్దు అయింది. ఆ రోజు ప్రారంభించాల్సిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ముందుగానే పండుగ కానుకగా సంక్రాంతి నాడే ఢిల్లీ నుంచే జెండా ఊపి ఆరంభించేశారు మోదీ. అలా ఆ పనిని మమ అనిపించేశారు. ఒక్క బెంగాల్ మినహా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను దగ్గరుండి జెండా ఊపే మోదీ.. ఈసారి మాత్రం ఎందుకో దూరంగానే ఉండిపోయారు.
దానికీ ఓ రాజకీయ లెక్క ఉందంటున్నారు. మోదీని సవాల్ చేద్దామని కేసీఆర్ పక్కా ప్లాన్ చేశారని చెబుతున్నారు. కావాలనే జనవరి 18న ఖమ్మం సభను ప్లాన్ చేసి.. ముగ్గురు సీఎంలను రప్పిస్తున్నారు బీఆర్ఎస్ బాస్. భారీ జన సమీకరణ సైతం చేస్తున్నారు.
ఖమ్మం వేదికగా కేంద్రంపై, బీజేపీపై, మోదీపై విరుచుకుపడి.. ఎప్పటిలానే దేశం గురించి అనేక ప్రశ్నలు సంధించి.. బీజేపీ విధానాలు, మత రాజకీయాలంటూ విమర్శించి.. ప్రధాని పర్యటన ముందు రోజు అనేక చిక్కుముడులు వేయాలని స్కెచ్ వేశారని అంటున్నారు.
ఈ గులాబీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన మోదీ.. తాను 19న సికింద్రాబాద్ పర్యటనకు వస్తే.. 18న జరిగే కేసీఆర్ సభపై మరింత ప్రాధాన్యం, ఆసక్తి పెరుగుతుందని గ్రహించారు. కేసీఆర్ తనను అనడం.. తాను మళ్లీ ఆయనకు కౌంటర్లు వేయడం.. వాటిపై ప్రజల్లో చర్చ జరగడం.. ఇదంతా బీఆర్ఎస్ పై దేశవ్యాప్తంగా అటెన్షన్ రావడానికి దోహదపడుతుందని భావించి.. ఎందుకైనా మంచిదని.. ఎలాంటి కారణం లేకుండానే హైదరాబాద్ పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారని అంటున్నారు.
మోదీని కార్నర్ చేసేందుకు ఈ నెల 18న ఖమ్మం సభను కేసీఆర్ ప్రకటిస్తే.. 19న తన పర్యటనను రద్దు చేసుకుని మోదీ తనదైనశైలిలో పావు కదిపారని చెబుతున్నారు. మరి, ఈ విషయంలో ఎవరు తగ్గినట్టు? ఇంకెవరు నెగ్గినట్టు?