Kodandaram on KTR: తాజాగా గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలను ఉద్దేశించి ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. అలాగే బీఆర్ఎస్ లక్ష్యంగా పలు విమర్శలు సైతం చేశారు. నిజామాబాద్ లో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కోదండరాం స్థానికంగా జరిగిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గత పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాడు నిరుద్యోగులను పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ లు నేడు కల్లబొల్లి మాటలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఉద్యోగాల భర్తీకి చొరవ చూపింది కాంగ్రెస్ ప్రభుత్వమే…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఉద్యోగాల భర్తీకి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కోదండరాం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగస్తుల ఆందోళనలను, సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుందన్నారు.
కేటీఆర్ ఆ మాటలు మానుకో..
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వల్లనే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు కోదండరాం అన్నారు. గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొట్టే ధోరణిలో కేటీఆర్ వ్యాఖ్యలు ఉంటున్నాయని, అటువంటి మాటలను మానుకోవాలని కోదండరాం సూచించారు. గ్రూప్-1 పరీక్షల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు లేదని, అభ్యర్థులు కూడా జీవో 55, 29ల అమలు వెనుక కోర్టు సూచనలు ఉన్నాయన్న సంగతిని తెలుసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉంటుందని, అందుకోసమే నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. యువతను బీఆర్ఎస్ నేతలు తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వాటిని సహించకుండా చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు.
కాగా హైదరాబాద్ లోని అశోక్నగర్లో మరోమారు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కగా.. నిరుద్యోగులు వారికి తోడయ్యారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మద్దతు పలికి, పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే పోలీసులు మాత్రం నిన్న సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విధంగా లాఠీలకు పని చెప్పకుండా సైలెంట్ గా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఆందోళన వద్దని కోరి, ప్రతిపక్ష పార్టీల మాయలో పడవద్దని సూచించారు. కానీ అభ్యర్థులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.