MLC Kavitha : బీజేపీ ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. అరవింద్ అనుకోకుండా గెలిచారని విమర్శించారు. అరవింద్ చిల్లరగా మాట్లాడతారని మండిపడ్డారు. నిజామాబాద్ పేరును బీజేపీ ఎంపీ చెడగొడుతున్నారని విమర్శించారు. బురదలో రాయి వేయకూడదనే ఇన్నాళ్లూ అరవింద్ను పట్టించుకోలేదన్నారు. తన గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. రాజకీయం చేయి.. పిచ్చి వేషాలు వేయకు అరవింద్ అంటూ కవిత ఘాటుగా అన్నారు. పార్టీ మారతానని అడ్డమైన కూతలు కూస్తే నిజామాబాద్ చౌరస్తాలో నిలబెట్టి చెప్పుతో కొడతానని అన్నారు. తాను ఆవేదనతో, బాధతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇంకోసారి గీత దాటితే ఊరుకోనని హెచ్చరించారు.
రాజకీయాల్లో ఉంటే నీతి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు కవిత. కుక్క కాటుకు చెప్పుదెబ్బ తప్పదన్నారు. తాను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్లో చేరతానని అన్నానా? అని ప్రశ్నించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని సవాల్ చేశారు. కాంగ్రెస్తో కలిసి గెలిచింది అరవిందే అని ఆరోపించారు.
పార్లమెంట్లో ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదని కవిత అన్నారు. బీజేపీలో చేరమని తనకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కాషాయ నేతలు చాలా ఆశలు చూపించారని వెల్లడించారు. బీజేపీ చేసిన ఆఫర్ ను తాను తిరస్కరించానని కవిత చెప్పుకొచ్చారు. ఏక్ నాథ్ షిండే తరహాలో ఈ ప్రతిపాదన తెచ్చారని వివరించారు. వారి ప్రతిపాదనను మర్యాదకపూర్వకంగా తిరస్కరించానని తెలిపారు. ప్రజలను, నాయకులను మోసం చేయబోమని స్పష్టం చేశారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.