Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేశారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని పేర్కొన్నారు. తనను ఇంటి వద్దే విచారించాలని గతంలో కవిత సుప్రీంలో పిటిషన్ వేశారు. అది పెండింగ్లో ఉండగానే.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపడంతో.. రాలేనంటూ కవిత జవాబిచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారారు. అంతకుముందే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో ఈడీ, సీబీఐ కవిత పేరును ప్రస్తావించాయి.