Update on MLC Kavitha Bail Petition Argument: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈసారి బెయిల్ వస్తుందా? రాదా? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానం తలుపు తట్టిందామె. ఓ వైపు ఈడీ, మరోవైపు సీబీఐ మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటున్నాయి. తాజాగా ఆమె వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది.
లిక్కర్ స్కామ్లో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. సోమవారం ఆమె తరపు న్యాయవాది విక్రమ్చౌదరి తమ వాదనలు వినిపించారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందన్నారు. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉందన్నారు. దీని కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని గుర్తు చేశారు. తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పిందన్నారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41(ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని, సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, తర్వాత ఎందుకు మారారో తెలియదన్నారు కవిత తరపు న్యాయవాది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందన్నారు. అదే రోజు అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిందని వివరించారు.
Also Read: రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో 13 మంది మృత్యువాత..
ఇదిలా ఉండగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసిందన్నా రు. అందుకు న్యాయస్థానం అంగీకరించిందని, కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదన్నారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత అరెస్టు వారంట్ లేకుండానే సీబీఐ ఆమెని అరెస్టు చేసిందని వివరించారు.
కవిత బెయిల్ వ్యతిరేకిస్తూ మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా చేశారు న్యాయమూర్తి. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనుంది ఈడీ తరపు న్యాయవాది. అనంతరం మళ్లీ రిజాయిండర్ వాదనలు వినిపించనున్నారు కవిత తరఫు న్యాయవాది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసే అవకాశముందని అంటున్నారు.