MLC Jeevan Reddy : బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేరని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం, కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్, కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లానును ఎస్సీ డెవల్మెంట్ ఫండ్గా మార్చి.. నిధులను మళ్లించిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నిధుల దారి మళ్లింపు చర్చకు రాకుండా ఉండేందుకు దళితబంధును తెరపైకి తెచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను నిండా ముంచిందన్నారు. అందుకే గిరిజనులంతా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో కేసీఆర్ హడావిడి చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు.