MLC By Elections Polling in Telangana: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక పోలింగ్ రూంకి సెల్ ఫోన్ అనుమతించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల సిబ్బంది. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
కాగా.. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.
మూడు జిల్లాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ బూత్ ల్లో 4లక్షల 63వేల 839 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ,బీఆర్ఎస్ , బీజేపీ మధ్యే త్రిముఖ పోటీ ఉండనుంది.
Also Read: Food Safety Department: హోటల్ నిర్వాహకులారా తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే తాట తీస్తారు..
పోలింగ్ కోసం ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో లక్షా73వేల 406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో లక్షా23వేల 985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో లక్షా66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.