BRS Party Latest News: అధికార BRS పార్టీలో టిక్కెట్ల ప్రకటన అప్పుడే మొదలైందా? అధినేత ఆదేశాలతోనే అభ్యర్థులను కేటీఆర్ ప్రకటిస్తున్నారా? అభ్యర్థుల ప్రకటనతో గులాబీ పార్టీ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందా? ఈసారి కేటీఆర్ అభ్యర్థులను ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి? అభ్యర్ధుల ప్రకటనపై గులాబీ పార్టీ నయా స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందా? ఇప్పటికే టిక్కెట్ కోసం గులాబీపార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా?
గులాబీ పార్టీలో అప్పుడే టిక్కెట్ల ప్రకటన మొదలైంది.BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఏ ఎన్నిక అయినా గులాబీ పార్టీ అభ్యర్థులను అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించేవారు. కానీ అందుకు భిన్నంగా కేటీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న కేటీఆర్ బహిరంగ సభ వేదికలపైనే.. పలువురు అభ్యర్థులను ప్రకటించారు.ఈ అంశం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
గులాబీ పార్టీలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడంపై కేటీఆర్ వ్యూహం ఏమయి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇతర నేతల నుండి అభ్యంతరం లేని చోట్ల మాత్రమే అభ్యర్థులను కేటీఆర్ ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించగా భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరామణారెడ్డిని ప్రకటించారు.ఇక.. హుస్నాబాద్ నియోజకవర్గంలో వొడిదెల సతీష్ కుమార్, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ ను కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేస్తారని కేటీఆర్ తెలిపారు. మరోవైపు కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని అధికారికంగా ప్రకటించారు.
2018అసెంబ్లీ ఎన్నికల సమయంలో BRS అధినేత కేసీఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం అందుకు విరుద్ధంగా కేటీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.అధిష్ఠానానికి క్లారిటీ ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే.. కేటీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు… అధినేత ఆదేశాలతోనే కేటీఆర్ సిట్టింగులకు హామీ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది.దీనితో మిగతా నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. BRS టిక్కెట్ కోసం పలువురు మాజీలు ఎదురుచూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.నియోజకవర్గాల్లో నేతలు బలప్రదర్శనలకు దిగుతున్నారు.దీనితో గులాబీ పార్టీలో పోటాపోటీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో క్లారిటీ వున్న అభ్యర్థులను కేటీఆర్ ప్రకటిస్తుండగా.. అభ్యర్థులను మార్చే జాబితాను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.
తాజా పరిణామాలు చూస్తుంటే.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైనట్టే అనిపిస్తోంది. అధికార పార్టీ ఇంత ముందుగా.. ఇంతటి క్లారిటీతో ఉంటే.. మరి విపక్షాల సంగతేంటి? కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యే అభ్యర్థులపై పెట్టిన ఫోకస్ ఏంటి? హస్తం పార్టీకి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ రావాల్సి ఉంటుంది. బీజేపీ.. రాత్రికి రాత్రి జంపింగ్ జపాంగ్లకు టికెట్లు ఇచ్చే చరిత్ర ఉంది. అలాంటి అభ్యర్థులు అధికార పార్టీ కేండిడేట్స్తో ఏ మేరకు పోటీ పడగలరు? ప్రతిపక్షాలు తొందరపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.