MLA Lasya Nanditha Escaped 3 Times from Death: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె. తండ్రి అడుగు జాడల్లోనే 2015లో రాజకీయాల్లోకి వచ్చింది. అదే ఏడాదిలో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డైన పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి.. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైంది. అనంతరం 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2023 ఫిబ్రవరి 19న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి మరణానంతరం లాస్య నందితకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే కేటాయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి, గద్దర్ కూతురు వెన్నెలపై లాస్య నందిత విజయం సాధించారు.
Read More: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూత
దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న, గీత దంపతుల పెద్ద కుమార్తె లాస్య నందిత. హైదరాబాద్ అశోక్నగర్లో జన్మించిన లాస్య నందిత.. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. ఎమ్మెల్యే లాస్య నందితకు ఇద్దరు సోదరీమణులు నమ్రతా, నివేదితా.
గతేడాది డిసెంబరులో లాస్య నందిత సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ కిందికి వెళ్లిపోవడంతో ఆమె అందులో చిక్కుకుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి, సురక్షితంగా బయటకు తీశారు.
ఇటీవలే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో కేసీఆర్ సభకు హాజరైన లాస్య నందిత.. హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నార్కెట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. కారు ముందు వైపు కుడి భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు దెబ్బలు తగిలాయి. ఆ గాయాల నుంచి కోలుకున్న 10 రోజులకే పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు.
గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి జి.సాయన్న అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు లాస్య నందిత.. ప్రజాప్రతినిధులైన ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఇద్దరూ ఫిబ్రవరి నెలలోనే మరణించడంతో.. ఆ కుటుంబానికి ఫిబ్రవరి నెల కలిసిరాలేదంటున్నారు సన్నిహితులు.