సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే పార్టీలోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే గులాబీ గూటికి మళ్లీ చేరేందుకు జగ్గారెడ్డి సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ నెల 19న ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీ మార్పుపై ఇంతవరకు జగ్గారెడ్డి స్పందించలేదు. కానీ ఆయనకు లైన్ క్లియర్ అయ్యిందని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలుగా బీఆర్ఎస్ అధినాయకత్వంతో ఆయన చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. అందుకే కొంతకాలంగా కేసీఆర్ పై విమర్శలు చేయడం మానేశారని అంటున్నారు. ఈ నెల 21 బీఆర్ఎస్ అభ్యర్థులు తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందులో జగ్గారెడ్డి పేరు ఉంటుందని సమాచారం.
జగ్గారెడ్డి బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986లో సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలిచారు. 1995 సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేపట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత గులాబీ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ చెంతన చేరారు.
2009 లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 నుంచి 2014 వరకు ప్రభుత్వ విప్ గానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. 2018 ఎన్నికల్లో మూడోసారి సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
తొలి నుంచి జగ్గారెడ్డి వివాదాస్పద నేతగానే ఉన్నారు. తాను ఉన్న పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేయడం ఆయన నైజం. నిలకడగా ఒకే పార్టీలో ఉండకపోవడం మరో మైనస్ పాయింట్. కొంతకాలంగా కాంగ్రెస్ లోనూ అసమ్మతి నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.