MLA Durgam Chinnaiah : మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ప్లాజా వద్ద బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్ చల్ చేశారు. గత నెలలో ఈ టోల్ప్లాజా ప్రారంభమైంది. అప్పటి నుంచి వాహనదారుల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. తన వాహనం అక్కడకు చేరుకోగానే టోల్ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో ఎమ్మెల్యే కారు దిగి టోల్ సిబ్బందిపైకి దూసుకెళ్లారు. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు.
తన వాహనానికి రూట్ క్లియర్ చేయకుండా… ముందున్న లారీని త్వరంగా పంపించకుండా తనను వెయిట్ చేయిస్తారా..? అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేశారు. వీఐపీలకు కేటాయించిన ఫ్రీ లేన్ నుంచి రాకుండా టోల్ వసూలు చేసే లేన్ లోకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కారు వచ్చి ఆగింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే తన కారు సైరన్ కొడుతుండటంతో మాట్లాడడానికి టోల్ ప్లాజ్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే తమపై ఎమ్మెల్యే దాడి చేశారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తున్నారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్ సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాధ్యతగా నడుచుకోవాల్సిన ఎమ్మెల్యే ఇలా దాడికి తెగబడటం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.