Telangana Election Schedule 2023 : నేడు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగనుంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్షన్ షెడ్యూల్ ఖరారు కానుంది. సీఈసీ రాజీవ్కుమార్ మీడియా ముందు ఎన్నికల తేదీని ప్రకటించనున్నారు.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీలకు జరగాల్సిన ఎన్నికల తేదీని సీఈసీ నేడు ప్రకటించనుండటంతో.. ఐదు రాష్ట్రాల్లోనూ ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్లలో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చత్తీస్గఢ్లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న కారణంగా.. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ యోచిస్తున్నట్లు సమాచారం. మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగుస్తుండగా.. తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గడువు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తున్నాయి.
ఇటీవలే దేశంలో జమిలి ఎన్నికలపై జోరుగా ప్రచారం సాగింది. కానీ కేంద్రం నుంచి పక్కా క్లారిటీ రావడంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే సీఈసీ బృందం తెలంగాణలో పర్యటించి పలువురు అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. ఎన్నికల నిర్వహణతో పాటు పోలింగ్ ప్రక్రియపై చర్చలు జరిపింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో.. రాజకీయ వర్గాలు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్గా భావిస్తున్నాయి.