TS Assembly Budget Sessions(Political news in telangana): ఎనిమిదవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 100 సంవత్సరాలు ఉండాల్సిన బ్యారేజీ.. మూడేళ్లకే నాణ్యతా లోపంతో కుంగిపోయిందన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎక్కడా ఇంతపెద్ద స్కామ్ జరగలేదన్నారు మంత్రి. మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టునే ఇక్కడ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మేడిగడ్డలోనే కాదు.. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలోనూ లీకేజీలు మొదలయ్యాయని, అదికూడా కుంగిపోయే అవకాశాలు లేకపోలేదన్నారు. డిజైన్, నాణ్యతా లోపం, అవినీతి కారణంగానే కాళేశ్వరం దెబ్బతిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం.. మేడిగడ్డ నిరుపయోగమని తేల్చి చెప్పారు.
కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీనే కుంగిపోతే.. మిగతా వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి డ్యామ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడుతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీలో అన్ని మోటర్లు పనిచేస్తే.. రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. రాష్ట్రం మొత్తం అవసరాలకు 160 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే.. ఒక్క కాళేశ్వరానికే 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేశారని ఎద్దేవా చేశారు. విజిలెన్స్, కాగ్ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక ఒక్కసారి కూడా ఇన్స్పెక్షన్ చేయలేదన్నారు.
Read More : ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్.. మేనిఫెస్టో ప్రకారమే కులగణనపై తీర్మానం
బ్యారేజీలు కుంగిపోయాక.. ఇప్పుడు మీరు తప్పుకుంటే మేమే బాగుచేస్తామని అంటున్నారు కానీ.. నిజానికి మీకు ఇంకా ఆ అర్హత ఉందని అనుకుంటున్నారా? అని మంత్రి ఉత్తమ్ ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చాక.. సంబంధిత మంత్రి కనీసం ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వఉంచితే ప్రమాదమని తెలిశాక.. బీఆర్ఎస్ దానిని ఖాళీ చేసిందన్నారు. ఇప్పుడు కాళేశ్వరంపై మాట్లాడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. ఇంకా 50 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని.. కాగ్ రిపోర్ట్ ప్రకారం.. ఇప్పటికే ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాటిపోయిందన్నారు. సాగునీటి రంగంలో విధ్వంసకరమైన విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని మంత్రి ఉత్తమ్ పవ్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. గత 10 ఏళ్లలో నీటి దోపిడీ పదింతలు పెరిగిందన్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు నీటి విషయంలో తీవ్ర నష్టం జరిగిందన్నారు.
కాళేశ్వరం టెండర్లు రూ.1800 కోట్లు అయితే.. అంచనా వ్యయం రూ.4500 కోట్లకు పెరిగిపోయిందదన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకే వేలకోట్లను కట్టబెట్టి.. నాణ్యతను గాలికి వదిలేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు అడుగుభాగం నుంచీ ఏపీ నీళ్లు తీసుకెళ్తున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు లక్షా 75 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. బీఆర్ఎస్ నిర్ణయాలు తెలంగాణను నట్టేట ముంచాయని అన్నారు. ప్రాజెక్టులకు ఇప్పుడు విపరీతంగా ఖర్చవుతుందని, గతంతో పోలిస్తే ఎకరానికి రూ.12 కోట్ల మేర ఖర్చవుతుందన్నారు.