Minister Uttam Kumar news(Today news in telangana): సుంకిశాల ఘటనపై వాటర్ వర్క్స్ సిబ్బంది విచారణ చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుంకిశాల ఘటన చాలా చిన్నదని..నష్టం కూడా తక్కువేనని స్పష్టం చేశారు. జగిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని అన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. నిర్మాణం పూర్తి అయ్యే సరికి ఒకటి నుంచి రెండు నెలలు అవుతుందని అన్నారు.
జులై 2వ తేదీన నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు పోటెత్తడంతో ఒక్కసారిగా పంప్ హౌజ్ రెండో సొరంగ మార్గం నుంచి వరద ఉధృతంగా వచ్చి చేరింది. దీంతోనే సుంకిశాల పంప్ హౌజ్ రక్షణ గోడ కూలి పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల పరిశీలించారు.
ఈ సందర్భంగానే మాట్లాడిన మంత్రి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తామని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుంకిశాల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారానే ఈ ఘటన గురించి ప్రభుత్వానికి తెలిసిందని ఈ మేరకు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిందని తెలిపారు.