Farm Loan Waiver: తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వారి రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీని మూడు దశల్లో చేపట్టింది. అయితే, కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కొందరు రైతులకు ఈ లబ్ది చేకూరలేదు. తమ రుణాలు మాఫీ కాలేవని వారు ఆందోళనలో పడ్డారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా గళం పెంచాయి. సాంకేతిక లోపాలతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి వారికి కూడా రుణమాఫీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల మాయ మాటల్లో చిక్కుకోవద్దని, తమ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉన్నదని, అర్హులైనవారందరికీ రుణమాఫీ చేస్తామని ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల రైతులతో ఆయన ఓ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే.. వారు ఆందోళన చెందవద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఇచ్చిన మాటకు నిజాయితీగా కట్టుబడి ఉన్నదని వివరించారు. రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను కలవాలని సూచనలు చేశారు. ఇందుకోసం రైతు వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను తాము మాఫీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. వడ్డీలతో రూ. 2 లక్షల పరిమితి దాటితో.. ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు కడితే.. వెంటనే తాము రూ. 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన కల్పించాలని సూచించారు.
Also Read: Telangana BJP: కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు.. వార్.. ఇన్ సైడ్ వార్
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను కలవాలని, ఆధార్ కార్డు నెంబర్ చెబితే సంబంధిత లోన్ వివరాలను అధికారులు తెలియజేస్తారని చెప్పారు. కొందరి రైతుల వివరాలు తప్పుగా నమోదయ్యాయని, అందుకే మాఫీ కాలేదని, అలాంటి తప్పులను ప్రస్తుతం సవరించుకోవచ్చని వివరించారు. ,ఆధార్ కార్డు నరెంబర్లు తప్పు ఉన్నా.. పాస్ బుక్లో పేర్లు తప్పుగా నమోదైనా మాఫీ కాదని, కాబట్టి, ఇలాంటి సమస్యలను సరి చేసుకుంటే వారికి మాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేనోళ్లు వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. వాళ్లే నేరుగా రైతు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలు తీసుకుని లోన్ మాఫీ చేస్తారని వివరించారు.