Minister Tummala Press meet against BRS(Telangana politics): రుణమాఫీపై ఆంక్షలంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నది. అయినా కూడా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. ఇప్పటివరకు 22 లక్షల రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగింది. వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశాలిచ్చాం. రుణమాఫీ పొందలేని రైతులు.. వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రైతు వేదికలు, మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటాం.
Also Read: జంతర్ మంతర్.. జన్వాడ ఫాంహౌస్ చూ మంతర్
గత పదేళ్లు పారిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు. తమ హయాంలో రైతులకు మోసం చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నది. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన పార్టీ కూడా ఇప్పుడు మాట్లాడుతోంది. ఈ రెండు పార్టీలు కూడా అసత్యాలను ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన పరిస్థితులను క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణమాఫీపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. బ్యాంకులు, అధికారులు ఏమైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే, 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు వెల్లడించాయి. వారి బకాయిలు రూ. 31 వేల కోట్లు ఉన్నాయి. చిన్న, సన్న కారు రైతులకు ఎక్కువగా రూ. 2లక్షల లోపు రుణాలే ఉన్నాయి. రైతులు ప్రతిపక్ష నేతల మాటలను పట్టించుకోవొద్దు. ఎటువంటి ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చూసుకోండి’ అంటూ మంత్రి పేర్కొన్నారు.