Minister Thummala Nageswara Rao: తెలంగాణలోని రేవంత్ సర్కార్ మొదటి నుండి రైతన్నల ప్రభుత్వంగా ఆదరింపబడుతోంది. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ తమది రైతన్నల ప్రభుత్వమని చాటి చెబుతోంది ప్రభుత్వం. కాగా తాజాగా రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పడమే కాక, భరోసా సైతం కల్పించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలన ప్రారంభ సమయం రైతన్నల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అందుకే రుణమాఫీ పథకాన్ని ప్రవేశ పెట్టి అందరికీ అండదండగా ప్రభుత్వం నిలబడిందన్నారు. అతి త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి సభలో గుర్తుచేశారు.
అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం సాగు చేసిన రైతులు నష్టపోయారని, ప్రతి గింజ తాము కొనుగోలు చేస్తామన్నారు. రైతులు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంపై దృష్టి సారించిందన్నారు. అలాగే తాము చేసిన కృషికి ముడి పామాయిల్ పై గల దిగుమతి సుంకాన్ని పెంచడం జరిగిందని, ఇప్పుడు గెలల ధర టన్నుకు రూ.14,392 నుంచి రూ.17,043కి పెరిగిందని మంత్రి తెలిపారు.
ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడిన మంత్రి ఘాటుగా విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందన్నారు. ఆ పార్టీ నేతల మాటలు అన్నీ మోసపూరిత మాటలేనని, రుణమాఫీ గురించి గత పాలకులు పట్టించుకున్నారా అంటూ మంత్రి అన్నారు. అలాగే.. ఏడాదిలోపు రూ.300 కోట్లతో సిద్దిపేట జిల్లాలో పామాయిల్ పరిశ్రమ తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. దీనితో రైతులు హర్షాతిరేకాలతో తమ ఆనందం వ్యక్తం చేశారు. పామాయిల్ పరిశ్రమ వస్తే చాలు.. ఇక తమ పంట పండినట్లే అంటూ రైతులు చర్చించుకోవడం కనిపించింది.
చివరగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రైతు కంట కన్నీరు రానివ్వని ప్రభుత్వంగా తాము అండగా ఉంటామని, సీఎం రేవంత్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ది సాధనతో పాటు.. అందరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రసంగంలో రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. కాగా సభకు రైతులు భారీగా తరలి రాగా.. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది.
అలాగే,
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగారు లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు.