Minister Tummala: రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ అనేక డౌట్స్ వ్యక్తం చేస్తోంది. రైతులకు అన్యాయం చేశారంటూ విమర్శల దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లెక్కలతో సహా ఓ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులనుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి, తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు పడుతున్న పాట్లు చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవ చేశారు.
‘‘ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయారు. ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యలేదు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి పంట లోపే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎటూ పాలుపోక విషం చిమ్ముతున్నారు. బ్యాంక్స్ నుండి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత మా ప్రభుతానిది. ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికి పథకాన్ని వర్తింప చేశాం. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం. 2 లక్షల పైన ఉన్న ఖాతాలకు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన పిదప, అర్హతను బట్టి చెల్లిస్తాం’’ అని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల.
బ్యాంకర్ల నుండి వచ్చిన డేటా తప్పుగా ఉన్నా కూడా అసలు వివరాలను రైతుల వద్ద నుండి కూడా సేకరిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరామన్నారు. అందరికీ సమాచారం కోసం గత ప్రభుత్వ నిర్వాకాలు ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు అందిజేస్తున్నామన్న ఆయన, కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో వున్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా హుందాగా ప్రవర్తించి, ప్రజల్లో తమ స్థాయిని కాపాడుకొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Also Read: BRS Party: గు‘లాబీయిస్ట్’ ఆఫీసర్స్.. ఇకనైనా మారండి సార్..!
ఇచ్చిన మాటకు కట్టుబడి, 31వేల కోట్ల నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితులను సరి చేసుకుని, ఆగస్ట్ 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తే కావాలని బురద జల్లడం కరెక్ట్ కాదన్నారు తుమ్మల.