Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన నేపథ్యంలో ఆయనను సన్మానించడానికి ఈ రోజు సీఎల్పీ సమావేశం జరిగింది. ట్రైడెంట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, సీఎంలు కలుసుకున్నారు. ఇక్కడే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కనిపించారు. దీంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేస్తూ.. శాసనసభా వ్యవహారాల మంత్రిగారు.. సీఎల్పీ సమావేశానికి అరికెపూడి గాంధీ హాజరయ్యారని ట్వీట్ చేశారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు ఆపాలని పేర్కొన్నారు.
ఈ కామెంట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారని, ఆయన ఏకంగా సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారని కూడా కొందరు అంటున్నారని పేర్కొన్నారు. ఆయన నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి అరికెపూడి గాంధీ వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన సీఎల్పీ మీటింగ్లో పాల్గొన్నారని చెప్పడమేమిటీ? మీరేమైనా ఆయన సీఎల్పీ మీటింగ్లో ఉండగా చూశారా? అని ప్రశ్నించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి మాత్రమే వచ్చారని, సీఎల్పీ సమావేశంలో పాల్గొనలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారని గులాబీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్లో చేరలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నది. ఈ వాదనల నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య హైటెన్షన్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాను బీఆర్ఎస్ పార్టీ నాయకుడినేనని, కాంగ్రెస్లో చేరలేదని అరికెపూడి గాంధీ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలనే మంత్రి శ్రీధర్ బాబు ఇది వరకు పేర్కొంటూ స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆయనే స్వయంగా చెబుతున్నారని వివరించారు.
Also Read: Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అరికెపూడి గాంధీకి ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్లో వివాదం రాజుకుంది. కాంగ్రెస్లో అరికెపూడి గాంధీ చేరారని, అందుకే ఆయనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాగా, ప్రతిపక్ష నేతకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే సంప్రదాయం ఉన్నదని, తాము దాన్ని కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కాకుండా.. ఎంఐఎం ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేస్తూ ఎదురుదాడికి దిగారు.