Minister Sridhar babu Seious on BRS: రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవను చూసి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని.. పార్టీలోకి వస్తా అంటే ఎవరైనా వద్దంటారా? అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.
‘ఫిరాయింపులపై మేం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గతంలో భయపెట్టి మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ లా మేం వ్యవహరించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారంతట వారే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్టీలో వస్తాం అంటే ఎవరైనా వద్దంటారా..?. ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు వారు పార్టీలో చేరుతున్నారు’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇతర పలువురు నేతలు మాట్లాడుతూ.. తమ పార్టీ టికెట్ పై గెలిచిన నేతలను మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ కూడా విసిరిన విషయం తెలిసిందే. ఇదేకాదు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్లింది బీఆర్ఎస్.
Also Read: బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్.. కాంగ్రెస్లో చేరిన ప్రకాశ్ గౌడ్
బీఆర్ఎస్ నేతల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. గతంలో కూడా తమ పార్టీకి చెందిన నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది మర్చిపోయారా అంటూ వారికి గతాన్ని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో గెలిచిన నేతలను బలవంతంగా, భయపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారని ఆరోపించారు. తాము అలా కాకుండా తమ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను చూసి వాళ్లంతట వాళ్లే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొంటున్నారు.