Minister Seethakka: మంత్రి హోదాలో తొలిసారి ములుగు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతక్క భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు మార్గాన ర్యాలీగా మేడారంకు బయలుదేరారు. సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకుని.. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీతక్క చెప్పారు. బీఆరెస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తనకు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చారన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సీతక్క. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని మంత్రి సీతక్క సూచించారు.