Minister Seethakka Slams BRS Over Damagundam Radar: బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దామగుండం ప్రాజెక్టుకు జీవో ఇచ్చిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమంటూ ఆమె మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యల గురించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. సమయం తక్కువగా ఉండటంతో నేరుగా ప్రజలు, పార్టీ శ్రేణుల వద్దకే వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు.
తమ భూములు లాక్కున్నారని, తమ గ్రామంలో కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కబ్జాలకు గురైన తమ భూములు తనకే దక్కిలా చూడాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, 98 డీఎస్సీ అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు కల్పించాలని, అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు ప్రభుత్వ అధికారులను తొలగించాలని, బీఆర్ఎస్ హయాంలో తమపై దాడులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులుగా తమను గుర్తించాలని, కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల భర్తీని త్వరగా పూర్తి చేయాలని, కుటుంబ అంతర్గత సమస్యలను పరిష్కరించాలని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా చేసిన నియామకాలపై విచారణ చేపట్టాలి.. వంటి పలు సమస్యలను మంత్రి సీతక్క కు వినతి పత్రాల ద్వారా ప్రజలు నివేదించారు. ఆ వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సీతక్క పలువురు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఆ ఆర్జీలు తక్షణం పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భూమికి సంబంధించిన పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వికలాంగులు పెన్షన్ కోసం వచ్చారు. అన్ని వినతులు తీసుకున్నాం.. వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తాం. దామగుండం ప్రాజెక్టుకు జీవో ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం సరైంది కాదు. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుంది. బీజేపీది గాడ్సే సిద్ధాంతం.. కాంగ్రెస్ ది గాంధీ సిద్ధాంతం.. రెండు ఎప్పటికీ ఒక్కటి కావు’ అంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Also Read: పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న
ఇదిలా ఉంటే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ ను ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత విషయంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇక్కడ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా సబ్ మెరైన్ లతో కమ్యూనికేషన్ బలపడనున్నదని చెప్పారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయొద్దని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం మరువలేమంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.