హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. మహారాష్ట్రలో పర్యటించిన మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటక, తెలంగాణలో నమ్మిన ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. డ్రగ్స్ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.
Also Read: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…
మంత్రి సీతక్క దీనిపై స్పందిస్తూ, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయలేదని, పైగా, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలకు నరకం చూపారని, ఢిల్లీ నడి వీధుల్లో 700 మంది రైతుల మరణానికి కారణం అయ్యారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించడంలో మోదీ నెంబర్ వన్ అని పేర్కొన్న సీతక్క, 60 ఏళ్లు దాటిన అన్నదాతలకు పెన్షన్ ఇస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
Also Read: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి
ఐదేళ్లు దాటినా ఇప్పటికీ దానిపై ఊసే లేదన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని చెప్పారు. పంట ఖర్చులకు అనుగుణంగా కనీస మద్దతు ధర పెంచలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్న మంత్రి, ఏకకాలంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో కొందరికి మాఫీ జరగలేదని, కొద్ది రోజుల్లోనే వారికి కూడా జమ అవుతాయని స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు సీతక్క. బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.