Minister Seethakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయభేరి మోగించిన ధనసరి సీతక్కకు కేబినెట్ లో చోటు దక్కింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా సీతక్కను నియమించారు. దళం నుంచి బయటికొచ్చిన సీతక్క అందరికీ తెలుసు. కానీ ఆమె దళంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో.. సామాజిక ప్రస్థానం ఎలా మొదలైందో తెలిస్తే.. అందరూ ఆశ్చర్యపోతారు.
మంత్రి సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. పరిస్థితుల నేపథ్యంలో 14 ఏళ్ల వయసులోనే నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితురాలై దళంలో చేరారు. అప్పటికి ఆమె 10వ తరగతి చదువుతోంది. దాదాపు 10 సంవత్సరాలు నక్సలైట్ గా జీవనం సాగించిన సీతక్క.. 1997లో ఆ హింసకు స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంపై ఉన్న మక్కువతో ఎల్ఎల్ బీ చదివారు.
రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2004లో టిడిపిలో చేరి.. తొలిసారి ములుగు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనుకోని పరిణామాల మధ్య.. 2017లో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు ములుగు నుంచి గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే సీతక్క.
రాజకీయాల్లో ఉంటూనే చదువు కొనసాగించిన ఆమె.. 2022లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. మంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేసేటపుడు మిగతా మంత్రులకంటే.. సీతక్కకే ప్రజలు జేజేలు పలికారు. ఆ నినాదాలతో ఎల్బీ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. తాజాగా.. సీతక్క దళంలో ఉన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.