ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రజాపాలన మొదలుపెట్టారు. సీఎం రేవంత్ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు TSRTC నిరంతరం పనిచేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీంమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా.. కొత్త బస్సులను తీసుకొచ్చారు. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సు లు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సులను ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్క ర్ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.
అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాదికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సు లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను TSRTC అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా TSRTC ప్లాన్ చేసింది.