AC buses will be run from the district centres in Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసింది. ఆ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. గతంలో రోజుకు 12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తరువాత వారి సంఖ్య 30 లక్షలకు పెరిగింది. దీంతో బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోతుంది. ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో అందులోనూ రద్దీ విపరీతంగా పెరిగింది.
ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామంటూ మంత్రి తెలిపారు. శనివారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన బస్సులను ప్రారంభించారు. నల్లగొండ-హైదరాబాద్ మధ్య నాన్ స్టాప్ ఏసీ, 3 డీలక్స్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కొత్తగా వెయ్యి బస్సులను కొన్నామని చెప్పారు. మరో 1500 బస్సులకు ఆర్డర్ కూడా ఇచ్చామంటూ ఆయన పేర్కొన్నారు. దసరాలోపు నల్లగొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులు ఇస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల గురించి కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామంటూ మంత్రి వివరించారు. రూ. 280 కోట్ల బకాయిల్లో రూ. 80 కోట్లు చెల్లించినట్లు ఆయన చెప్పారు. మిగిలిన రూ. 200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్ర నుంచి హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాలకు లగ్జరీ బస్సులు నడుపుతామంటూ ఆర్టీసీ మంత్రి వివరించారు.
Also Read: కేయూలో తప్పిన ప్రమాదం,గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడి..
అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మంత్రి ప్రకటనతో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, కొత్త బస్సుల రాకతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. త్వరలో నల్లగొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామని చెప్పారు. కొత్త బస్సుల్లో నల్లగొండ జిల్లాకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.