తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూటే సెపరేటు. ఆయనకు ప్రజా నేతగా పేరుంది. నిత్యం జనం మధ్య ఉండేందుకే ఇష్టపడతారాయన. రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు నుంచి ఇదే ధోరణిలో ఉన్నారు. అందువల్లే 2014లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయనకు ప్రజల్లో క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయభేరి మోగించారు. మంత్రి పదవిని దక్కించుకున్నారు. మంత్రైనా ఆయన తన సింప్లిసిటీని వదులుకోలేదు. కాన్వాయ్తో హడావిడిలేదు. సాధారణ నేతగానే ప్రజల్లోకి వెళుతున్నారు.
తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట, దానవాయిగూడెం గ్రామాల్లో బైక్ తిరుగుతూ జనంతో మమేకమయ్యారు. స్థానిక ప్రజల పరిస్థితులపై ఆరా తీశారు . 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో ఆకస్మాత్తుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించటంతో అధికారులు షాక్ అయ్యారు. బైక్ పైనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు.
వీధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు మంత్రి. ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గవ్యాప్తంగా తరచూ ఆకస్మాత్తుగా పర్యటనలు చేస్తానని పొంగులేటి తెలిపారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు.. తన దృష్టికి వచ్చాయని.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.