– భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు
– కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు ప్రయత్నాలు
– అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
New Bill: కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజల నుండి అభిప్రాయ సేకరణ పూర్తి అయిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలో చట్ట రూపకల్పనపై దృష్టి సారించాలని, అవసరమైన కసరత్తును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నింటినీ ఒక దగ్గర పొందుపరచి పరిశీలించాలన్నారు. వచ్చిన వాటిలో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఏది అవసరమో ఆ అంశాలను కొత్త చట్టంలో ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని సూచనలు చేశారు. మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్టుగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు పొంగులేటి.
“తెలంగాణ ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే, గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో అది నెరవేరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. 2020 రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూ యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు మరింత పెరిగాయి. రైతులు, భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పుల తడకగా ఉన్న ధరణి వల్ల రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా మేధావులు, నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ప్రజా ప్రతినిథులు, రైతులు, సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించాం’’ అని వివరించారు.
Also Read: Guntur: కాపాడు తల్లీ.. మహా వృక్షమమ్మా! వేప చెట్టుకు అద్భుత దేవాలయం
జిల్లా స్థాయిలో నిర్వహించిన వర్క్ షాప్లలో వచ్చిన సూచనలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే భూపరిపాలన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయి. లిఖిత పూర్వకంగా, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా కొందరు పంపారు. సామాన్యులు సైతం పలు సూచనలు చేశారు. అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉన్న ధరణిని తమ ప్రభుత్వం పబ్లిక్ డాక్యుమెంట్గా అందరికీ అందుబాటులో ఉంచబోతోందని ప్రకటించారు.