అవ్వా కావాలి.. బువ్వా కావాలి అన్నట్టు ఉన్నాయి మంత్రి కేటీఆర్ వ్యూహాలు. తెలంగాణలో వైసీపీ, టీడీపీ అనుకూల ఓట్లు గంపగుత్తుగా బీఆర్ఎస్ కే పడిపోవాలని ఆరాట పడుతున్నారు. రీసెంట్గా ఆయన చేస్తున్న కామెంట్స్ చూసే అదే అర్థం అవుతుంది. కానీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందటున్నారు రాజకీయ పండితులు. అసలు కేటీఆర్ స్ట్రాటజీ ఏంటి ?
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసం ఇక్కడి రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంటుంది. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్టుపై అప్రమత్తం అయ్యాయి. మొదట బీజేపీ. ఏపీ బీజేపీ కానీ, జాతీయ నేతలు కానీ.. చంద్రబాబు అరెస్టుపై స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వరుస పెట్టి చంద్రబాబు అరెస్టును ఖండించారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడినా.. ఆ పార్టీని అభిమానించే వాళ్లున్నారు. కాబట్టి ఆ ఓట్ల కోసం టీబీజేపీ ప్రయత్నం.
బీజేపీ తర్వాతే కాంగ్రెస్ స్పందించినా.. కాస్త గట్టిగా రెస్పాండ్ అయింది. చంద్రబాబు జాతీయ స్థాయినేత అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అరెస్ట్ ను ఖండించారు. టీడీపీ అభిమానుల నిరసనలకు హైదరాబాద్ లో అనుమతి లేదన్న మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆ పార్టీ నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అందులోను కేటీఆర్లో ఎక్కువగా కనిపిస్తోంది. మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం చంద్రబాబుకు మద్దతిచ్చారు. కేటీఆర్ మాత్రం ఈ విషయంలో ఏమనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ.. వైసీపీ, టీడీపీ మద్దతుదారుల ఓట్లు తమకే పడిపోవాలనే క్లారిటీ కేటీఆర్ కి ఉంది.
చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని మీడియా అడిగిన ప్రశ్నలకు.. పక్క రాష్ట్రం పంచాయతీలు మనకెందుకు అని ఓ సందర్భంలో దాటవేశారు కేటీఆర్. తెలంగాణలోనే చాలా పంచాయతీలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలకు అనుమతి లేదని చెప్పారాయన.
కేటీఆర్ కామెంట్స్ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు టీడీపీ అనుకూల ఓట్లు పడవనే అనుమానం కలిగిందో ఏమో కానీ.. వారిని ప్రసన్నం చేసేలా కామెంట్స్ మొదలుపెట్టారు. రీసెంట్గా కేంద్రం అమరావతికి ఏం ఇచ్చిందని పాత ప్రశ్నను కొత్తగా సంధించారు కేటీఆర్. అమరావతి చంద్రబాబు మానసపుత్రిక. అలాంటి అమరావతికి అనుకూలంగా మాట్లాడితే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. దీంతో.. మళ్లీ వైసీపీకి వ్యతిరేకం అవుతానని కేటీఆర్ భావించినట్టు ఉన్నారు. అందుకే నష్ట నివారణ కోసం ఈసారి ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఏపీకి కూడా ఐటీ కంపెనీలు రావాలని స్వయంగా ఆహ్వానించారు. అవసరమైతే.. జగనన్నను అడిగి స్థలం కూడా ఇప్పిస్తానని ఐటీ కంపెనీలకు మాట కూడా ఇచ్చేశారు. తెలంగాణలోని వైసీపీ అభిమానుల ఓట్లు కూడా తమకే పడిపోతాయని భావిస్తున్నట్టు ఉన్నారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అమరావతి నిర్మాణానికి కేసీఆర్ రూ.100 కోట్లు ఇవ్వాలనకున్నారని చెప్పారు కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర వెళ్లి ధర్నా చేస్తామన్నారు. కానీ చేసింది లేదు. ఇప్పుడు కూడా కేటీఆర్ ఎన్ని మాటలు చెప్పినా.. చంద్రబాబుకు మద్దతుగా చేసే నిరసనలకు అనుమతి లేదని చేసిన కామెంట్స్ పెద్ద నష్టాన్ని చేస్తాయని రాజకీయ విశ్లేషకుల మాట. కేటీఆర్ వ్యూహాలు ఎలా పనిచేస్తాయో చూడాలి మరి.