Komatireddy Comments: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈసారి అలా కాకుండా అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆయన కోరుకున్నట్లు చెప్పారు. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ నేతలపై పలు విమర్శలు చేశారు. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తోనే కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకే మెట్రోను తీసుకరాబోతున్నామన్నారు. నగర అభివృద్ధి కోసం ఈసారి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే, కేటీఆర్ ఆరోపించినట్లుగా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగిపోతుందని ఆయన ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.