The Badi bata Program: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లను మూసివేసి.. ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరుచుకోవాలనేది తమ ప్రభుత్వ నినాదమని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల గ్రామంలోని పాఠశాలలో ప్రొఫేసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు అయ్యిందని, అసలైన రాష్ట్రం డిసెంబర్ 3న తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే వచ్చిందన్నారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టిందన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యా వ్యవస్థను పటిష్టపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లావాత్మకమైన మార్పులు తెస్తామన్నారు. ఈ పాఠశాలలోనే తాను ఏడో తరగతి వరకు చదివానని ఆయన చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి స్టూడెంట్స్ కు సూచించారు.
ఆ తరువాత బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఆయన సందర్శించారు. వచ్చే నాలుగు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని తెలిపారు. ఇక్కడి చెరువు వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదేవిధంగా నార్కట్ పల్లి డిపోనకు మరో వారం రోజుల్లో 20 కొత్త బస్సులు రాబోతున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
ఇటు మూసీ నది గురించి కూడా మంత్రి మాట్లాడారు. నాలుగేళ్లలో మూసీ నదిని పూర్తిగా సుందరీకరిస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. విద్య విషయంలో కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ చిన్న చూపు చూశారని.. అందుకు నిదర్శనమే మొన్నటి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అంటూ మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.