Kishan Reddy on BRS: బీఆర్ఎస్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరి స్తోందా? వికారాబాద్ నేవీ రాడార్ కేంద్రంపై ఎందుకు రాద్దాంతం చేస్తోంది? అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యింది?
తెలంగాణలో రాజకీయంగా పూర్వవైభవం సాధించేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. రేవంత్ సర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని రాజకీయం చేసే పనిలో పడింది. మీడియా ముందుకొచ్చి రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
వికారాబాద్ అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నేవీ ముందుకొచ్చింది. దశాబ్ద కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో నేవీ అధికారులతో మంతనాలు చేశారు. అప్పటి కేసీఆర్ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దానికి కొన్ని షరతులు పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. దీనిపై పోరాటం చేస్తామంటూ సోమవారం కేటీఆర్ వ్యాఖ్యానిం చారు. దీంతో నేవీ అధికారులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం మీడియా ముందుకొచ్చారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.
ALSO READ: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!
రాడార్ స్టేషన్ విషయంలో బీఆర్ఎస్ రెండు నాల్కుల ధోరణి వీడాలని సున్నితంగా హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. వీలైతే కేసీఆర్కు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాడార్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు.
పదేళ్లుగా ఎన్నో రకాలుగా అధికారులు వివరాలు ఇచ్చారని, శంకుస్థాపన సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు కేంద్రమంత్రి. ఆ ప్రాంతంలో ఉన్న రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఎవ్వరినీ వెళ్లనివ్వడం లేదన్న వార్తలపై రుసరుసలాడారు. గుడి విషయంలో అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.
రాడార్ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణకు గొప్ప పేరు వస్తుందన్న మంత్రి కిషన్రెడ్డి, 2,900 ఎకరాల్లో భూముల్లో 1500 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు ఉండవని వివరించారు. అలాంటప్పుడు చెట్లు నరికేస్తున్నారంటూ అబద్దాలు ఎలా ప్రచారం చేస్తారని దుయ్యబట్టారు.
పర్యావరణం పరిరక్షించడంలో భారత సైన్యం టాప్ లో ఉందన్నారు కేంద్రమంత్రి. ఈ విషయం మీకు తెలీదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మిలటరీ క్యాంపుల్లో పచ్చదనానికి పెద్ద పీఠ వేస్తున్నారని, ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
చివరకు సైనికులు వాడే దుస్తులు, వాహనాలు సైతం గ్రీన్ కలర్ వాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై చాలామంది న్యాయస్థానికి వెళ్లారని, అధికారులు వివరాలు అందజేశారని గుర్తు చేశారు. ఫారెస్టు ఏరియాలో కొత్తగా లక్షల సంఖ్యలో చెట్లను నాటుతామన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుతో నేవీ అధికారులు బాధపడిన విషయాన్ని వివరించారు.
దేశంలో రెండో రాడార్ వ్యవస్థ తమిళనాడు తర్వాత తెలంగాణకు రావడం శుభపరిణామంగా వర్ణించారు మంత్రి. అలాంటి ప్రాంతం వికారాబాద్ అడవుల్లో ఉందన్నారు. సెక్యూరిటీ, సేఫ్టీ, కమ్యూనికేషన్ వ్యవస్థకు అనుకూలమైందన్నారు. దీని ద్వారా కొన్ని వందల మందికి ప్రత్యక్ష్యంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్కు హితవు పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.