Minister Jupalli slams KTR, RS Praveen Kumar Comments: మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య విషయమై ఆ పార్టీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుందన్నారు.
హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడడం అనేది సరికాదన్నారు. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందన్నారు. గతంలో తమ పార్టీ కార్యకర్తలు మృతిచెందినప్పుడు తాను ఇలా ఆరోపణలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. మృతుడికి ఆయన కుటుంబంలోనే తగాదాలున్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్.. వీరిద్దరూ కూడా అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి గాను వాళ్లు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ప్రధాని మోదీ ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు. మతపరమైన రిజర్వేషన్లను తీసేస్తానంటూ మోదీ ఎలా చెబుతారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఆ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఎలా మాట్లాడుతారని ఆయన అన్నారు.
ముస్లిమ్స్- హిందువుల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు లేవని, కేవలం వెనుకబడిన తరగతుల వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విషయమై ఆయన ప్రధాని మోదీకి హెచ్చరిక చేశారు. మళ్లీ ఇంకోసారి ఆ అంశంపై మాట్లాడితే డిఫర్మేషన్ కేసు వేస్తానని ఆయన పేర్కొన్నారు.
Also Read: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు
ఇటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు. వ్యవసాయ శాఖపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదంటూ కిషన్ రెడ్డిని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్ఎస్ పీని కేంద్రం నిర్ణయిస్తుందనే కనీస అవగాహన కూడా కిషన్ రెడ్డికి లేదంటూ జగ్గారెడ్డి సైటర్లు వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఐదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే కొనసాగుతారన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. బీఆర్ఎస్ నాయకుడి మర్డర్ పై కాంగ్రెస్ నేతలపై దుష్ర్పచారం చేయడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు.