Minister Jupalli Krishna Rao Comments: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి పార్లమెంటులో కేసీఆర్ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. ప్రతి సందర్భంలోనూ రాజకీయం చేశారంటూ ఫైరయ్యారు.
ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..’పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల స్ఫూర్తిని కేసీఆర్ తుంగలో తొక్కారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు.
అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. తెలంగాణ వస్తే చాలు- మరే పదవి వద్దన్నాడు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ను విస్తరించి.. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కన్నాడు. సారు.. కారు.. పదహారు అన్నావు… పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న సీట్లు పోయాయి. చివరకు డిపాజిట్లు కూడా రాలేదు.
పూర్తి మెజార్టీ ఉండి కూడా.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆనాడు తన పార్టీలో చేర్చుకున్నాడు. విలువలు ఉండి ఉంటే ఆనాడు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని విలీనం చేసేవాడు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని.. బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడారు. అధికారంలో ఉన్నపుడు బీజేపీ పార్టీతో అంటకాగారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆ ఎమ్మెల్యేలు వీడుతున్నారు. సుస్థిర ప్రభుత్వం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
Also Read: ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు
ప్రభుత్వాన్ని కులుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?. ప్రజా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవిని వదులుకున్నారు.
వారిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిరంజన్ రెడ్డి లేఖ రాయాల్సింది రాహుల్ గాంధీకి కాదు.. బీజేపీతో కుమ్మకు అయినప్పుడు, రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలోకి తొక్కినప్పుడు కేసీఆర్ కు లేఖ రాసి ఉండాల్సింది. కేసీఆర్, నిరంజన్ రెడ్డి లాంటివారు చేసిన నిర్వాకాల వల్లే ప్రజలు వారిని తిరస్కరించారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలకు తెలుసు. రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్పగా మార్చారు. నీ అవినీతి, అక్రమాలు, కబ్జాల గురించి ప్రజలకు తెలుసు.
అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడించారు. ఇకనైనా తప్పుడు పిచ్చి మాటలు, తప్పుడు ఆరోపణలు మానుకోవాలి’ అంటూ మంత్రి జూపల్లి మండిపడ్డారు.
Also Read: గోల్కొండలో బోనాల సందడి.. అమ్మావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
అనంతరం షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడటం.. దయ్యాలు.. వేదాలు వల్లించినట్లు ఉంది. మీరు చేస్తే సంసారం.. అదే మేము చేస్తే వ్యభిచారమా? ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేశారు. బీర్ఎస్ పార్టీకి మనుగడ లేదని కార్యకర్తల భావిస్తున్నారు. అందుకే వారి అభీష్టం మేరకే .. ఆ పార్టీనీ వీడి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. విభజన సమస్యల పరిష్కారానికే ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు’ అని ఆయన అన్నారు.