తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అందివచ్చిన ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారాన్ని అనుసరించేందుకు కూడా నేతలు వెనుకాడడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తోందంటూ రెండు రోజుల నుంచి ప్రచారం మొదలైంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు.. ఏకంగా సీఎం కేసీఆర్ ఫోటోలు పెట్టి ప్రత్యేకంగా పోస్టులు వైరల్ చేశారు. అన్ని గ్రూపుల్లోనూ అదే పనిగా.. కొత్త రేషన్ కార్డుల జారీ అంశం ప్రచారంగా మారింది.
అయితే తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తేల్చి చెప్పారు.
మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీతో అప్పటి వరకు జరిగిన ప్రచారానికి తెరపడింది. ఎన్నికలు సమీపిస్తున్నందునే అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెర లేపిందని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.