Monkeypox: ఆఫ్రికా దేశాల్లో మాంకీ పాక్స్(ఎంపాక్స్) వైరస్ కలకలం సృష్టిస్తోంది. సుమారుగా ఈ వైరస్ 70 దేశాలకు పాకింది. ఈ వైరస్ వల్ల వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Also Read: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు
రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై చర్చించారు. అయితే, ఇప్పటివరకైతే రాష్ట్రంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. అలర్ట్ గా ఉండాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలోని గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.