Millionaire Politicians of Telangana: తెలంగాణలోని 119 ఎమ్మెల్యేల్లో.. 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకున్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని ఈ సంస్థ లెక్కతేల్చింది.
తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక.. పార్టీల పరంగా చూస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది.
అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రూ.161 కోట్లతో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి టాప్లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో కందాల ఉపేందర్రెడ్డి (పాలేరు), రూ.91 కోట్లతో పైళ్ల శేఖర్రెడ్డి (భువనగిరి) నిలిచారు. ఇక.. మంత్రి కేటీఆర్కు రూ.41 కోట్లు ఆస్తులు, రూ.27 కోట్లు అప్పులు ఉండగా.. సీఎం కేసీఆర్కు రూ.23 కోట్లు ఆస్తులు, రూ.8కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లలో చూపారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో తనకు రూ.56 కోట్ల ఆస్తి, రూ.8 కోట్ల అప్పు ఉందని తెలిపారు.
ఇక.. యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలో తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. రూ.కోటికిపైగా అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో కందాల ఉపేందర్రెడ్డి టాప్లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.63 కోట్లతో మర్రి జనార్దన్రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నారు.