Meridian School :
⦿ ఫీజుల పేరుతో మెరీడియన్ దోపిడీ
⦿ పెనాల్టీ పేరుతో తల్లిదండ్రుల రక్తం తాగుతున్న వైనం
⦿ ఫీజు ఆలస్యం అయితే విద్యార్థులకు వేధింపులు
⦿ అధిక మనీ కట్టాలంటూ బరితెగింపు
⦿ రిసిప్ట్ ఇచ్చి మరీ దోచేస్తున్న యాజమాన్యం
⦿ డీఈవోకు ఫిర్యాదు చేసిన బాధితులు
⦿ ఎంఈవోతో విచారణ జరిపిస్తామని హామీ
⦿ తిరుపతయ్య కమిటీ సూచనలు అమలు చేయాలని డిమాండ్
⦿ కార్పొరేట్ దందాపై ఈడీ తనిఖీలకు రిక్వెస్ట్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పునాది బలంగా ఉంటేనే ఇల్లు మన్నికగా ఉంటుంది. ఎక్కువ కాలం ఉంటుంది. ఇదే ఫార్ములాను పిల్లల చదువు దగ్గర కూడా అమలు చేస్తుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు మెరుగైన విద్య అందించాలని, పాఠశాల విద్య స్ట్రాంగ్గా ఉండాలని, ఎంత కష్టమైనా భరిస్తూ కార్పొరేట్ చదువులు చదిస్తుంటారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చదువంటే వ్యాపారంలా అయిపోయింది. కాసులు కొట్టకపోతే క్లాసుల్లోకి నో ఎంట్రీ. ఆఖరికి పరీక్షలు రాస్తున్న వారిని కూడా మధ్యలోనే ఆపి పనిష్మెంట్స్ ఇస్తున్న దుస్థితి దాపురించింది. తాజాగా మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్ ఫీజుల దందా వెలుగులోకి వచ్చింది.
లక్షల్లో ఫీజులు
మాదాపూర్ కేంద్రంగా మెరీడియన్ స్కూల్స్ నడుస్తున్నాయి. నగరంలో మాదాపూర్తో పాటు బంజారాహిల్స్, కూకట్ పల్లి, ఉప్పల్, మైలార్దేవ్పల్లి ఏరియాల్లో బ్రాంచీలు ఉన్నాయి. ఇక్కడ చదవాలంటే డబ్బులు దండిగా ఉండాల్సిందే. ప్రభుత్వ రూల్స్ పట్టవు. అధికారులంటే ఏమాత్రం లెక్కలేదు అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంటుంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా కొర్పొరేట్ దందా నడిపిస్తోంది మెరీడియన్ స్కూల్ యాజమాన్యం.
ఫీజు లేట్ అయితే విద్యార్థులకు వేధింపులు
ప్రైవేట్ స్కూళ్లలో వాళ్లు పెట్టే రూల్సే ఉంటాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ ఫాలో కావడం కష్టం. ఫీజులు సకాలంలో చెల్లించకపోతే అంతే. మరీ బరితెగించి వ్యవహరిస్తుంటారు. విద్యార్థులను గంటల తరబడి నిలబెట్టడం. పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, పరీక్ష మధ్యలోనే బయటకు పంపడం చేస్తుంటారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న మెరీడియన్ స్కూల్ కూడా అంతే. ఫీజ్ ఆలస్యమైన విద్యార్థులను అందరి ముందు అవమానించడం చేస్తోంది. పరీక్ష మధ్యలోనే బయటకు తీసుకెళ్లి వేరే రూమ్లో గంటల తరబడి నిలబెడుతోంది.
ఆలస్యంగా ఫీజు కడితే జరిమానా
మెరీడియన్ స్కూల్ బరితెగింపు ఎంతలా ఉందంటే, అనుకున్న టైమ్కి 15 రోజుల ఫీజు ఆలస్యం అయినందుకు రూ.25వేల పెనాల్టీ వేసింది. రూ.85వేలు అయితే, పెనాల్టీతో కలిపి లక్ష 10వేల దాకా తల్లిదండ్రులు చెల్లించాల్సి వచ్చింది. అదికూడా బహిరంగంగా రిసిప్ట్ ఇచ్చి మరీ ఈ ఫీ‘జులుం’ కొనసాగిస్తోంది. ఫీజు ఆలస్యం కారణంగా కొద్ది రోజుల నుంచి 8 మంది విద్యార్థులను వేధింపులకు గురి చేసింది. అందరి ముందు అవమానించింది. ఇది మాదాపూర్ పరిధిలో జరగగా, మిగిలిన బ్రాంచుల్లో కూడా ఇవే రూల్స్ పాటిస్తోంది.
డీఈవోకు కంప్లయింట్.. విచారణకు హామీ
మెరీడియన్ స్కూల్లో జరుగుతున్న దందాపై బాధితులు రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీందర్ రావుకు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా జరుగుతున్న ఫీ‘జులుం’పై ఆధారాలతో సహా వివరించారు. ఈ నేపథ్యంలో డీఈవో ఫిర్యాదులపై స్పందించారు. దీనిపై ఎంఈవోతో విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్పొరేట్ దందాపై ఈడీ విచారణకు డిమాండ్
కార్పొరేట్ హంగులతో ఉండే ప్రైవేట్ స్కూల్స్లో ప్రతీ ఏడాది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా మెరీడియన్ స్కూల్స్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే, పుస్తకాలు, డ్రెస్, ఇంకా ఏవేవో చెప్పి వసూలు చేసే సొమ్ము అదనం. ఫీజు కట్టడం కాస్త ఆలస్యం అయితే మాత్రం, విద్యార్థులను అవమానించి వారిలో అభద్రతాభావాన్ని పెంపొందిస్తున్నాయి ఇలాంటి కార్పొరేట్ స్కూళ్లు. ఈ నేపథ్యంలో బాధితులు తిరుపతయ్య కమిటీ సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై రెయిడ్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫీ‘జులుం’పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.