Medigadda barrage news(Latest news in telangana): కాళేశ్వరం ప్రాజెక్టులో అసలేం జరిగింది? బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారమే జరిగిందా? సంతకాల కోసం ఆనాటి పెద్దలు ఒత్తిడి చేశారా? మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యత లోపాల వెనుక ఏం జరిగింది? గత బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోందా? మాజీ ఈఎస్సీ నరేందర్రెడ్డి ఏయే విషయాలు బయటపెట్టారు? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ పెద్దలను వెంటాడుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి జరిగిన తతంగాన్ని పూసగుచ్చి మరీ బయటపెట్టారు మాజీ ఈఎస్సీ నరేందర్రెడ్డి.
నాలుగేళ్లు బ్యారేజీలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్ ముందు వెల్లడించారాయన. అలా వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తడంలో మాన్యువల్ను పాటించ లేదని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణంలో సున్నితమైన పనులను ఫ్లడ్ లైట్స్ వెలుగులో చేశారని వివరించారు. అంతేకాదు కాంక్రీట్ ను అపరిమిత వేగంతో నింపారన్నది ఆయన చెబుతున్న మాట. ముఖ్యం గా టెండర్ల ఖరారు, బ్యారేజీల వైఫల్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ప్రధానంగా కారణమని తేలినా ఈఎన్సీ పదవీకాలం పొడిగించారని తెలిపారు.
ALSO READ: నాకు సెక్యూరిటీ వద్దు.. ప్రజలతో సంబంధాలు దెబ్బతింటాయి: ఎమ్మెల్సీ కోదండరాం
మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లను సీడీవో ఒక్కరే తయారు చేయలేదని మాజీ ఈఎస్సీ నరేందర్రెడ్డి వెల్లడించారు. సీడీవోతో కలిసి ఎల్ అండ్ టీ తయారు చేసిందన్నారు. నిర్మాణానికి ముందు బ్యారేజీల ప్రదేశాలను పరిశీలించామని, నిర్మాణం ప్రారంభమైన తర్వాత వెల్లలేదన్నారు. మేడిగడ్డ నిర్మాణం, నాణ్యతలో తీవ్ర లోపాలు జరిగాయని వెల్లడించారు.
వర్షాకాలంలో ముందు వెనుక చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు మాజీ ఈఎన్సీ. నిర్మాణ సమయంలో తనిఖీలు లేవని స్పష్టంచేశారాయన. 2023లో మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగిన తర్వాత వెళ్లి పరిశీలించానన్నారు. నిర్మాణ సంస్థ, ఇంజనీర్లు పట్టించుకోలేదని, వైఫల్యానికి కారణమైన వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించారని కమిషన్ ముందు వెల్లడించారు.
మాజీ ఇంజనీర్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆనాటి ప్రభుత్వ పెద్దలను విచారణకు రప్పించాలనే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడైనా గత ప్రభుత్వం పెద్దలు కమిషన్ ముందుకు వెళ్తారా? లేక సమయం కావాలని తప్పించుకుంటారా? అన్నది చూడాలి.