Medaram Hundi Total Income(TS news updates) : మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. హన్మకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 29న ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ మార్చి 6వ తేదీన ముగిసింది. మొత్తం 540 హుండీలను లెక్కించేందుకు వారంరోజుల సమయం పట్టింది. ఈ హుండీల ద్వారా మేడారం జాతరలో రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో జరిగిన జాతరకంటే.. ఈ ఏడాది జరిగిన జాతరలో 1.79 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. 2022 జాతరలో ఆదాయం 11.44 కోట్ల రూపాయలు వచ్చింది.
Read More : ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపికబురు, అందులో 10% డిస్కౌంట్
ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర పూర్తయిన అనంతరం హుండీలన్నింటినీ హన్మకొండ టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదాయాన్ని లెక్కించారు. తొలిరోజు లెక్కింపులో నకిలీ నోట్లు కలకలం రేపాయి. నగదు, నాణేలు కలిపి 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం రాగా.. బంగారం 779 గ్రాములు, వెండి 55 కిలోలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్నీ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, మరో 100 మంది.. మొత్తం 450 మంది వాలంటీర్లతో హుండీ లెక్కింపు నిర్వహించారు.
ఇక తొలిరోజు హుండీ లెక్కింపులో సిబ్బందికి నకిలీనోట్లు దర్శనమిచ్చాయి. నోటుపై గాంధీ బొమ్మకు బదులుగా అంబేద్కర్ ఫొటో కనిపించడం కలకలం రేపింది. మొత్తం 20కి పైగా 100 రూపాయల నకిలీ నోట్లు కనిపించాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరగ్గా.. 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.