Suicide : సోదరుడి వరుసయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివాహిత ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధి హైదర్గూడ గుమ్మకొండకాలనీలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారానికి చెందిన సోమేష్కు సూర్యాపేట జిల్లా కాసరబాదుకు చెందిన చామంతి(28)తో 2010లో వివాహం జరిగింది.
వివాహం అనంతరం వారు అత్తాపూర్కు వచ్చి స్థిరపడ్డారు. సోమేష్, చామంతులకు ఒ కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం గుమ్మకొండకాలనీలో సోమేష్ సోదరుడు నర్సింహులుతో కలిసి ఓ ఇల్లు కొన్నాడు. మొదటి అంతస్తులో నర్సింహులు కుటుంబం ఉంటుండగా.. కింది అంతస్తులో సోమేష్ భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.
భర్త సోమేష్ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా.. భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సోమేష్ సోదరుడు నర్సింహులు బావమరిది యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి ఉంటూ రెండు కుటుంబాలతో సఖ్యతగా మెలగుతున్నాడు.
ఈ నెల 23న ఉదయం సోమేష్, నర్సింహులు, ఆయన భార్య సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి వెళ్లారు. ఉదయం 8 గంటలకు చామంతి పిల్లలను పాఠశాలకు పంపించింది. 10.30కు తల్లికి ఫోన్చేసి మాట్లాడింది. మధ్యాహ్నం 3.30గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపుతట్టగా.. ఆమె తలుపు తీయలేదు.
పిల్లలు కిటికీలో నుంచి చూడగా.. తల్లి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో కుమారుడు చుట్టుపక్కలవారికి చెప్పడంతో వారంతా తలుపు బద్ధలు కొట్టారు. హాల్ లో చామంతి, పడకగదిలో శేఖర్ ఉరేసుకుని కనిపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. చామంతి, శేఖర్ ఎందుకు బలవన్మరణాలకు పాల్పడ్డారనే దానిపై స్పష్టతలేదు. వారిద్దరూ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.