Marri Shashidharreddy : కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రులు సోనోవాల్ , కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు.
మర్రి శశిధర్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీజేపీనే దీటు ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను గద్దె దించటమే లక్ష్యమని తేల్చిచెప్పారు.
మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కితాబిచ్చారు. ఎవరు తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మార్పు బీజేపీతో సాధ్యమని నమ్ముతున్నారని స్పష్టం చేశారు. బీజేపీతో కుటుంబ ,అవినీతి, అహంకార పాలన పోతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ను ఎదుర్కొలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మర్రి శశిధర్ రెడ్డిని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది. గతంలో అక్కడ నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.