Congress: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడారు. వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ పదునైన ఆరోపణ బాణాలు సంధించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని.. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. పీసీపీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దని తాను కూడా అధిష్టానానికి చెప్పానన్నారు మర్రి.
తనలాంటి ఒక హోంగార్డు పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదంటూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డైలాగ్ ను రిపీట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ చెప్పుకొచ్చారు శశిధర్ రెడ్డి.
టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కు లేదని.. హస్తం పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది నయం చేయలేని స్థితికి చేరిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. తనలానే త్వరలోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో బలం తగ్గిపోవడం, వరుస ఓటమిలతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సీనియర్లతో సెపరేట్ గ్రూప్ మెయిటెన్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇక కాంగ్రెస్ లో తన ఉనికి కష్టమేనని భావించిన మర్రి.. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. త్వరలోనే కాషాయ కండువ కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.