తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసులు నజర్ పెట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రత్యేక బలగాలు దండకారణ్యంలోని బేస్ క్యాంపులకు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచారు.
శనివారం (డిసెంబర్2) నుంచి వేడుకలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి 23 సంవత్సరాలైన సందర్భంగా ఈ వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 2000వ సంవత్సరం డిసెంబర్ 2న కరీంనగర్ జిల్లాలోని కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో నాటి పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ లు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ పీఎల్ జీఏను స్థాపించారు. అప్పటి నుంచి డిసెంబర్ 2 అంటే.. మావోయిస్టులు మరువలేని రోజుగా మారింది. పీఎల్ జీఏను బలోపేతం చేసేందుకు ఏటా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాయుధ దళాలతో పాటు సంప్రదాయ బాణాలు, విల్లంబులు, కత్తులతో కూడిన 38 వేల మంది జన్ మిలీషియా సభ్యులతో పీఎల్ జీఏ పార్టీలోని సెంట్రల్ మిలటరీ కమిషన్ కు అనుసంధానంగా పనిచేస్తోంది.
మావోయిస్టుల వారోత్సవాలను అడ్డుకోవాలని స్పెషల్ పార్టీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగారు. గోదావరి తీరంపై పోలీసులు బలగాలు డేగకన్ను వేశాయి. సరిహద్దుల్లో హెలికాఫ్టర్లను సిద్ధం చేసి.. ఏరియల్ సర్వే చేస్తున్నారు. సీఆర్పీఎఫ్, గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్ లో భాగంగా దండకారణ్యంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులకు ప్రత్యేక బలగాలను తరలించారు.