Telangana: ఎన్నాళ్లో వేచిన రోజు. వానల కోసం ఆశగా ఎదురుచూసిన రోజు. రానే వచ్చేసింది. రెండు వారాలుగా రానురానంటూ రాయలసీమలోనే ఆగిపోయిన రుతుపవనాలు.. తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి ఖమ్మం గడపలో ఎంట్రీ ఇచ్చింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడొచ్చు. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చు. లేటుగా అయినా లేటెస్ట్గా ఎంటరైన రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతం ఉండొచ్చని అంచనా.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఎండలు తగ్గాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే, అవి రుతుపవనాల వల్ల కావని.. మామూలు వానలేనని అంటున్నారు. అసలైన వర్షాలు.. రాగల మూడురోజుల్లో ఉంటాయని చెబుతున్నారు.
హైదరాబాద్లో బుధవారం నుంచే వానలు వచ్చిపోతున్నాయి. సిటీ కూల్ కూల్గా ఉంది. ఇన్నాళ్లూ ఎండలతో మాడిపోయిన నగరవాసులు.. కాస్త రిలాక్స్ అవుతున్నారు. అయితే, వానలు పడితే అసలు నరకం ముందుంటుందనే విషయం గుర్తుకొచ్చి హడలిపోతున్నారు.
ఎండవేడికి ఎలాగోలా తట్టుకున్నారు ఇన్నాళ్లూ. కానీ, వానాకాలం హైదరాబాద్లో టార్చరే. గతంలో సరిగ్గా ఆఫీసులు క్లోజ్ చేసే సమయానికి వాన పడేది. ఉన్నపళంగా వాన దంచికొట్టేది. ఇక ఖతం. రోడ్లన్నీ జలమయం. డ్రైనేజీ వాటర్ అంతా రోడ్ల మీదకు వచ్చి చేరేది. వరద వెళ్లే మార్గం లేక.. రోడ్లన్నీ నీటితో మునిగిపోయేవి. ఇంకేం ఎక్కడి వాహనాలు అక్కడే. ఫుల్ ట్రాఫిక్ జామ్స్. గంటల తరబడి.. ట్రాఫిక్లో, వాన+మురుగు నీళ్లలో నరకం చూసేవారు సిటిజెన్స్. మళ్లీ వానాకాలం వచ్చిందని తెలీగానే.. గతాన్ని గుర్తు చేసుకొని టెన్షన్ పడుతున్నారు. బండ్లు, కార్లు కాకుండా.. ఈ సీజన్లో మెట్రో అయితే సో బెటర్ అనుకుంటున్నారు.