Manoj : మేడ్చల్ జిల్లా శామీర్పేట్ కాల్పుల కేసులో నటుడు మనోజ్కు కోర్టు రిమాండ్ విధించింది. హెల్త్ చెకప్ తర్వాత నిందితుడిని అల్వాల్లో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. జడ్జి ఆదేశాలతో మనోజ్ ను రిమాండ్లోకి తీసుకున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదైంది.
శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో శనివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. సిద్ధార్థదాస్ అనే వ్యక్తిపై మనోజ్ ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు శామీర్పేట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
భార్య స్మితతో సిద్ధార్థదాస్ 2019లో విడిపోయారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్పేట్లోని విల్లా నంబర్ 21లో మనోజ్ తో సహజీవనం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. శనివారం సిద్ధార్థదాస్ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చారు. ఈ క్రమంలో స్మితతో వాదన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మనోజ్ ఎయిర్గన్తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు.
పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్, స్మిత కలిసి అనేక మోసాలు పాల్పడ్డారని తెలుస్తోంది. ఓ సంపన్న యువతిని ట్రాప్ చేసి యాక్టింగ్ పేరుతో 50 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.